ఎయిర్‌టెల్‌ ప్లాన్లపై మరింత డేటా | Sakshi
Sakshi News home page

రోజువారీ డేటా పరిమితి పెంపు

Published Wed, Dec 6 2017 7:16 PM

 Airtel Rs. 349 Plan Now Offers 2GB Data Per Day, Rs. 549 Recharge Provides 3GB Daily  - Sakshi

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తన ప్లాన్లపై రోజువారీ డేటా పరిమితిని మరింత పెంచింది. రిలయన్స్‌ జియో, ఇతర ఇంక్యుబెంట్లతో వస్తున్న పోటీ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.   సమీక్షించిన ఎయిర్‌టెల్‌ రూ.349, రూ.549 ప్లాన్లలో రోజు వారీ లభించే డేటా లిమిట్‌ను 500 ఎంబీ మేర పెంచింది. ఇతర ఉచితాలతో పాటు రోజుకు అదనంగా 500 ఎంబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. దీంతో అప్‌డేట్‌ చేసిన రూ.349 ప్లాన్ ద్వారా ఇప్పుడు రోజుకు 1.5 జీబీ కాకుండా 2జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.549 ప్లాన్‌లో ఇప్పటి వరకు రోజూ 2.5 జీబీ డేటా లభించగా ఇకపై రోజూ 3జీబీ డేటా లభ్యం కానుంది. ఇక ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అప్‌డేట్‌ చేసిన ఈ ప్లాన్లు జియో ప్లాన్లకు తీవ్ర పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. అదేవిధంగా వొడాఫోన్‌, ఐడియాలు కూడా తమ ప్లాన్లను అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. 

రూ.349 ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ సెప్టెంబర్‌లో లాంచ్‌ చేసింది. తొలుత ఈ ప్లాన్‌ను లాంచ్‌ చేసినప్పుడు, అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స​, 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రోజుకు 1జీబీ డేటా అందించింది. తర్వాత నవంబర్‌లో డేటా పరిమితిని 1.5జీబీకి పెంచింది. ప్రస్తుతం ఈ పరిమితిని 2జీబీకి పెంచేసింది. దీంతో మొత్తంగా కస్లమర్లు 56జీబీ డేటా పొందనున్నారు. అదేవిధంగా రూ.549 ప్లాన్‌పై కూడా రోజువారీ డేటా పరిమితిని 2.5జీబీ నుంచి 3జీబీకి పెంచింది. డేటాతో పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు, రోమింగ్‌పై ఉచితంగా అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ను 28 రోజుల పాటు అందిస్తోంది. ఈ పెంపుతో మొత్తంగా 84జీబీ డేటాను ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్లు పొందుతారు. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్‌టెల్ రూ.349, రూ.549 ప్లాన్లలో డేటాను పెంచడంతో ఇప్పుడు జియో కన్నా ఎక్కువ మొబైల్ డేటా వినియోగదారులకు లభిస్తుంది.

Advertisement
Advertisement